పాలకులను నిలదీయాలి: విద్యుత్ ధర్నాలో షర్మిల
- Details
- Category: రాష్ట్రీయం
-
04 Mar 2013
- Published on Monday, 04 March 2013 13:45
పాలకులు ప్రజల దగ్గరకు వెళ్తే కరెంట్ కష్టాలు తెలుస్తాయని షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఇంత ఘోరమైన కరెంట్ సంక్షోభం ఎప్పుడూ లేదన్నారు. విద్యుత్ చార్జీల పెంపు, కరెంట్ కోతలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన మహాధర్నాలో షర్మిల ప్రసంగించారు. చొక్కా పట్టుకుని నిలదీస్తే కానీ పాలకులు మాట వినరని అన్నారు.
యూజర్ ఛార్జీలు వసూలు చేసిన ఘనుడు చంద్రబాబేనని గుర్తు చేశారు. రైతులు పంటలు పండిచడమే తప్పన్నట్టుగా చంద్రబాబు వ్యవరించారన్నారు. బాబు తన హయాంలో రుణమాఫీ ఎందుకు చేయలేదని షర్మిల ప్రశ్నించారు. ప్రజావ్యతిరేక సర్కారుపై అవిశ్వాసం పెట్టమని బాబును ప్రతిరోజు అడుగుతున్నామన్నారు. అవిశ్వాసమంటే బాబుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. బాబు ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ప్రతినాయకుడుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
జగనన్న ఏ తప్పు చేయలేదని, అబద్దపు కేసులు పెట్టి ఆయనను జైలు పాలు చేశారని పేర్కొన్నారు. ఉదయించే సూర్యుణ్ని ఎవరూ ఆపలేరన్నారు. రాజన్న కలలను జగనన్న నెరవేరుస్తారని షర్మిల అన్నారు.











